ఎవరైనా ఏపీలో ఏం జరుగుతోంది?అని ప్రశ్నిస్తే ‘రాజకీయాలు’ అని సమాధానం చెప్పుకోవాలి. గత నాలుగేళ్ళుగా ఏపీలో రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి.
మరేమీ జరగడం లేదు. అందుకే పొరుగు రాష్ట్ర మంత్రులు కూడా ఏపీలో పార్టీలు, నేతలపట్ల, రాష్ట్రం పట్ల చులకనగా మాట్లాడుతుంటారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి ఘాటు విమర్శలు చేశారు.
మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారు. కనుక ఆయన ఇంకా ఎంతకాలం బయట ఉంటారో ఎప్పుడు జైలుకి వెళతారో ఆయనకే తెలీదు. తన భవిష్యత్ ఏమిటో తనకే తెలీదు. కానీ నువ్వే మా నమ్మకం జగన్. నువ్వే మా భవిష్యత్ సిఎం జగన్ అంటూ ఇంటి గోడలపై స్టిక్కర్స్ అంటించుకోవడం విడ్డూరంగా ఉంది.
ఈ నెల 9 నుంచి ‘జగనన్నకు చెపుదాం’ అనే మరో కార్యక్రమం చేపడతారట! నాలుగేళ్ళుగా ఏనాడూ ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే సిఎం జగన్మోహన్ రెడ్డే. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నుంచి బటన్ నొక్కేందుకు మాత్రమే జగన్ బయటకు వస్తుంటారు. ఏనాడూ ప్రజలను కలిసి వారి కష్టనష్టాలను తెలుసుకోలేదు. ప్రజల నుంచి ఒక్క అర్జీ స్వీకరించలేదు.
కనీసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఏడాదికిపైగా ఆందోళన చేస్తుంటే జగన్ ఏనాడూ వారి వద్దకు వెళ్ళి మాట్లాడలేదు కనీసం వారిని తన వద్దకు పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నాలుగేళ్ళలో ఒక్కసారి కూడా అఖిపక్షం నిర్వహించి రాజధాని, పోలవరం, ప్రత్యేకహోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తదితర అంశాల గురించి చర్చించిందిలేదు. ఏనాడూ ప్రజాసమస్యలు వినలేదు. మరి జగనన్నకు చెప్పుకొని ఏం ప్రయోజనం?” అని రామకృష్ణ ప్రశ్నించారు.
జగన్ భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంఖుస్థాపన చేయడానికి మే 3వ తేదీన విశాఖకు వస్తున్న రోజూ నుంచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తామని, చిత్తశుద్ధి ఉంటే వచ్చి సంఘీభావం తెలపాలని రామకృష్ణ సవాలు విసిరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రధాని నరేంద్రమోడీకి పూర్తి క్లారిటీ ఉందని కానీ ఏపీలో టిడిపి, వైసీపీలకే లేదని సీపీఐ రామకృష్ణ అన్నారు.
