శ్రీసత్యసాయి జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు స్వామివారి రథోత్సవాన్ని (తేరు) చూడటానికి కదిరికి వెళ్లాడు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రథం లాగుతున్న సమయంలో అనిల్ ప్రమాదవశాత్తు రథచక్రం కింద పడిపోయాడు. ఈ ఊహించని ఘటనతో అక్కడున్న భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
రథచక్రం అనిల్ కాలుపై నుండి వెళ్లడంతో అతని కాలు ఎముక తీవ్రంగా విరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన తోటి భక్తులు మరియు పోలీసులు అతడిని రథం కింద నుండి బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనిల్ను వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు.
స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని వెళ్లిన యువకుడు ఇలా ప్రమాదానికి గురికావడంతో పులగంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఉత్సవాల సమయంలో భక్తులు రథం దగ్గర అప్రమత్తంగా ఉండాలని, అధికారులు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
