అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం
రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చిరుత మృతి
రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పైభాగంలోని కొండ ప్రాంతంలో ఉన్న “ఏనుగుల బావి”లో ఒక చిరుత మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు బావిలో చిరుత పడి మృతి చెందినట్లు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బావిలో పడిపోయిన చిరుత మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై అనంతపురం జిల్లా డీఎఫ్ఓ చక్రపాణి మాట్లాడుతూ — చిరుత నీరు తాగేందుకు బావి వద్దకు వచ్చి బురదలో ఇరుక్కుపోయి మృతి చెందిన అవకాశముందని తెలిపారు. చిరుత శరీరంపై బయటకు కనిపించే ఎటువంటి గాయాలు లేవని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మృతికి గల అసలు కారణం స్పష్టమవుతుందని తెలిపారు.
