Latest Posts

అరాచకాలను అంతం చేస్తాం: అసెంబ్లీలో భావోద్వేగానికి లోనైన సీఎం చంద్రబాబు నాయుడు!

గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక మరియు సామాజిక విధ్వంసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో పాలకులు తనను వ్యక్తిగతంగా అవమానించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నానని, తనలాగే ఎందరో బాధితులు గత ప్రభుత్వ అరాచకాలకు బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వాటన్నింటినీ గమనించే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందుంచామని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో భూ సమస్యలు మరియు రెవెన్యూ రికార్డుల గందరగోళంపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూములను లాక్కోవడానికి 22ఏ జాబితాను ఆయుధంగా వాడుకున్నారని, మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులు తగలబెట్టడం వంటి ఘటనలు వారి అరాచకాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా 2026 నాటికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి భూయజమానికి భరోసా కల్పించేలా రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

తిరుమల లడ్డూ ప్రసాదం మరియు ఆలయాల పవిత్రతపై చంద్రబాబు మాట్లాడుతూ.. గత పాలకులు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కు అంటగట్టి బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలను రాష్ట్రంలో సాగనివ్వబోమని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Posted Under AP
Editor