ఏపీలో అమరావతి రాజధాని భూకుంభకోణం నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రి నారాయణ లబ్ది పొందారని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది.
ఇప్పటికే చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ తో పాటు నారాయణకు చెందిన పలు ఆస్తుల అటాచ్ మెంట్ కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగా సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి తెచ్చుకున్నారు.
చంద్రబాబు ఉండవల్లి కరకట్టపై నివసిస్తున్న ఇంటితో పాటు నారాయణకు చెందిన పలు ఆస్తుల అటాచ్ మెంట్ కోసం విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న అనుమతి ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయా ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు సీఐడీ అధికారులు అడుగులేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చినందున ఏ క్షణమైనా వీటి స్వాధీనం కోసం సీఐడీ సిద్ధమవుతోంది.
పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ టీడీపీ ప్రభుత్వ హయాంలో తాను రాజధానిలో పొందిన భూములకు ప్రతిఫలంగానే కరకట్టపై తన గెస్ట్ హౌస్ ను చంద్రబాబుకు ఇచ్చారని, ఇదంతా క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని సీఐడీ ఆరోపిస్తోంది. దీంతో ముందుగా ఈ గెస్ట్ హౌస్ ను స్వాధీనం చేసుకునేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుగా లింగమనేని రమేష్ కు నోటీసు జారీ చేసి ఈ ప్రక్రియ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మాజీ మంత్రి నారాయణకు చెందిన పలు ఆస్తుల స్వాధీనానికి కూడా సీఐడీ సిద్ధమవుతోంది. అమరావతిలో నారాయణ కుటుంబసభ్యుల పేరుతో ఉన్న దాదాపు 75 వేల చదరపు గజాల ఇళ్ల స్ధలాల్ని కూడా సీఐడీ త్వరలో స్వాధీనం చేసుకోబోతోంది. అలాగే నారాయణ కుటుంబ సభ్యులు ఇంతకాలంగా భూసమీకరణలో ఇచ్చిన భూములకు పొందిన కౌలు మొత్తం రూ. కోటీ 92 లక్షలను కూడా రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
