Latest Posts

బాబును అందుకే కలిశా.. : పవన్ కళ్యాణ్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సుదీర్ఘ భేటీ అనంతరం ఈ ఇద్దరు మీడియా ముందుకు వచ్చారు. ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడుని కలవడానికి కారణం కుప్పంలో జరిగిన సంఘటన అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చంద్రబాబు నాయుడుని కుప్పంలో తిరగనివ్వకపోవడం, ఒక ప్రతిపక్ష నేతగా ఆయన హక్కులు కాల రాయడం, ప్రజలను కలవనీయకుండా చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ చూసి ఇప్పటికే ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశామని, ఈరోజు అదే అంశం మీద స్వయంగా నా సంఘీభావం తెలియజేయటానికి వచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన మీద కూడా చర్చించామని అన్నారు. రాష్ట్రం కోసం మేము ఎలా నిలబడాలి? ఏం చేయాలి? ఒక జవాబుదారీ ప్రభుత్వాన్ని ఎలా తీసుకురావాలి? ఒక జవాబుదారీతనాన్ని ఎలా తీసుకురావాలి? ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఎలా సిద్ధం చేయాలి?

అనే విషయం మీద చర్చించామని పవన్ అన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పెన్షన్లు తీసేసిన విధానం, ఫీజు రీయింబర్స్ మెంట్, లా అండ్ ఆర్డర్, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అంశాల మీద సుదీర్ఘంగా చర్చించామని, లోతుగా చర్చించామని అన్నారు. ఏదైనా ప్రజల సమస్యల గురించి వాళ్ళను కలవాలని అనుకుంటే కలవనివ్వకుండా ఒక జీఓ తీసుకువచ్చి బ్రిటిష్ కాలం నాటి ఒక జీవో తీసుకొచ్చి అసలు ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల వారు ఎవరు తిరగకూడదు ప్రజల దగ్గరకు వెళ్ళకూడదు అని, ఓడిపోతామని తెలిసి ఇలాంటి చెత్త జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని కట్టడి చేయడం మీద కూడా చర్చించామని అన్నారు. గతంలో విశాఖపట్నంలో కూడా నాకు ఇదే పరిస్థితి ఎదురయింది, లోపల నుంచి బయటకు రాకూడదు అంటూ ఆంక్షలు విధించారు. అలాగే ఇప్పటం గ్రామం వెళదామని నేను అనుకుంటే పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా ఉండాలని నిర్బంధించారని అన్నారు. సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నేత. విభజిత ఆంధ్ర ప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత చంద్రబాబును ఇలా చేయడంతో ఆయనకు నా సంఘీభావం తెలియజేసేందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. అదేవిధంగా ఈ జీవో మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎలా ఈ జీవోని కట్టడి చేయాలనే అంశం మీద కూడా ఇద్దరం చర్చించామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే అందరూ ఈ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తుల మీద ప్రకటన చేసే అవకాశం ఉందని భావించారు. కానీ అలాంటి ప్రస్తావన ఏమీ లేకుండానే పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగించడంతో ఒక రకంగా కీలక ప్రకటన లేదనే చెప్పాలి.

Editor