గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్ పేరుతో తరచూ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయాలను సందర్శించేవారిని సమాచారం. అంతేకాదు హైదరాబాద్, పూరీ ప్రాంతాలతో ఆమెకు లింకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆమె గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టుకు ముందు నుంచే కేంద్ర నిఘా సంస్థలు జ్యోతిపై దృష్టి సారించాయి. ఆమె కదలికలపై ఎప్పటికప్పుడు కన్నేయడం మొదలుపెట్టాయి. అంతా నిర్ధారించుకున్న తర్వాత చివరకు మే 17న అరెస్టు చేశారు.
హర్యానాలోని హిస్సార్కు చెందిన ‘ట్రావెల్ విత్ జెఓ’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది జ్యోతి మల్హోత్రా. గతేడాది సెప్టెంబర్లో పూరీ ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ ఓ మహిళా యూట్యూబర్ను కలిసిందని పూరీ పోలీసులు చెబుతున్నమాట.
పూరీకి చెందిన ఆ మహిళ ఇటీవల పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు ప్రయాణించిందని తెలుస్తోంది. మరి పూరీకి చెందిన ఆ మహిళ భారత్ గురించి పాకిస్థానీ నిఘా వర్గాలకు ఏమైనా సమాచారాన్ని ఇచ్చిందా? లేదా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.