గత కొద్ది కాలంగా తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా అదే విధంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జడ్పిటిసి మీద హత్యాయత్నం జరిగింది. దాడి జరిగిన కొద్దిసేపటికి అతను తీవ్రస్థాయిలో రక్తస్రావానికి గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే సోమవారం నాడు ఉదయం ఎప్పటిలాగే చేర్యాల జడ్పిటిసి శెట్టి మల్లేశం లేచి వాకింగ్ కి వెళ్ళాడు. అయితే అతనిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారంతా ఒక్కసారిగా దాడి చేయడంతో మల్లేశం తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మల్లేశం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లడమే గాక హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హాస్పిటల్ కి తీసుకు వచ్చిన సమయంలోనే అతని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. ఇక ఆ వెంటనే అంబులెన్స్ సిద్ధం చేసి హైదరాబాదుకు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలోనే అతని పరిస్థితి విషమించి మరణించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు రియల్ ఎస్టేట్ గొడవలే కారణమని ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మల్లేశం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేత కాగా సిద్దిపేటలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ పార్టీ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సిద్దిపేట వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే నిజానికి అతని మీద దాడి చేశారన్న విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాకింగ్ కి వెళ్లిన సమయంలో ఆయన రోడ్డు పక్కన రక్తం మడుగులో పడి ఉన్నాడు. దీంతో అసలు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారా లేక ఏదైనా వాహనం ఢీ కొట్టిందా అనే విషయం మీద కూడా చర్చ జరిగింది, అయితే చివరికి అతని మీద దాడి జరిగిందని చివరికి గుర్తించారు.
