ఏపీ మండలిలో లడ్డూ రగడ..!

తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన స్వల్పకాలిక చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మంత్రి అచ్చెన్నాయుడు, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మధ్య జరిగిన వాగ్వాదం సభలో కలకలం రేపింది.

 

చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్‌ను ఉద్దేశించి “మీరు క్రిస్టియన్ అనుకున్నాను” అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై చైర్మన్ తీవ్రంగా మండిపడ్డారు. “నేను హిందువును, నన్ను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరు?” అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టడంతో, చివరకు మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పర్వతరెడ్డి చర్చలో పాల్గొంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ యూనిట్ అని, కల్తీ నెయ్యి దొరకగానే వెబ్‌సైట్‌లో దాని పేరు మార్చేశారని పర్వతరెడ్డి ఆరోపించారు. 1998లో హెరిటేజ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా టీటీడీకి మిల్క్ పౌడర్ సరఫరా చేసిందని, అడిట్ అభ్యంతరాలు ఉన్నా బిల్లులు పాస్ చేసుకున్నారని తూమాటి పేర్కొన్నారు. సీబీఐ చార్జ్‌షీట్‌లోని 209వ పేజీలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా ఉందని, కేవలం ఫిర్యాదు కాపీని పట్టుకుని టీడీపీ అబద్ధాలు ఆడుతోందని వారు విమర్శించారు.

 

ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుండగా మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు పదేపదే అడ్డు తగిలారు. చర్చ ప్రారంభమైన 20 నిమిషాల్లోనే 17 సార్లు మంత్రులు అడ్డుపడటంపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. “నా మైక్ కూడా కట్ చేస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం చర్చ ముగిశాకే ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇవ్వాలని చైర్మన్ స్పష్టం చేసినా, మంత్రులు ముందుగానే ప్రకటన చేస్తామని పట్టుబట్టడం గందరగోళానికి దారితీసింది.

 

మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ సభలో వైఎస్సార్‌సీపీ నేతలను నిందితులుగా పేర్కొనడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరేమైనా పోలీసా? సీబీఐ అధికారా?” అని ప్రశ్నించారు. మొత్తం మీద లడ్డూ వివాదంపై వాస్తవాలు బయటకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రతిపక్షం ఆరోపించగా, నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని అధికార పక్షం వాదించింది.

Posted Under AP
Editor