Latest Posts

మళ్లీ పంజా విసురుతున్న COVID.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్, దాని సబ్ వేరియంట్లు పంజా విసురుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ.. అలర్ట్ జారీ చేసింది. కొత్త వేరియెంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పంపించింది. పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్నింగ్‌కు పంపాలని సూచించింది. కరోనాకు పుట్టినిల్లు చైనాతో పాటు జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లో వంటి దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ దేశాల్లో నిత్యం వేలల్లో కేసులు వస్తుండడంతో ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసుల దృష్ట్యా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు సంబంధించి సానుకూల నివేదికలు పంపాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా ఎన్‌సీడీసీ, ఐసీఎంఆర్‌లకు లేఖ పంపారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ లేఖలో సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి బుధవారం ఉదయం 11 గంటలకు కరోనాపై సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. కరోనా కొత్త వేరియంట్ జన్యు పరీక్ష ద్వారా తెలుస్తుంది. జపాన్, యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్, చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా పాజిటివ్ కేసుల నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

ఇతర దేశాల నుంచి మనదేశంలోకి వస్తున్న తరుణంలో ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం నెట్‌వర్క్ ద్వారా కరోనా ప్రమాదకరమైన వేరియంట్‌ను ట్రాక్ చేయడానికి అవసరం అని అన్నారు. అన్ని రాష్ట్రాలు వీలైనంత వరకు అన్ని కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను ప్రతిరోజూ INSACOG జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్‌కు పంపేలా చూడాలని సూచించారు. ఈ ప్రయోగశాలలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం మ్యాప్ చేశారు. కరోనా ప్రస్తుతం దేశంలో పరిస్థితి సాధారణంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 112 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3490కి తగ్గింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 3 మంది చనిపోయారు. రోజువారీ కోవిడ్ మరణాల సంఖ్య మార్చి 2020 నుంచి ఇదే అతి తక్కువ కావడం గమనార్హం.

Editor