చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. చైనాలోని పెద్ద నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ కేసులు చైనాతో ఆగవని.. మళ్లీ ప్రపంచానికి పాకుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి.. టీకాల ద్వారా పొందిన వ్యాధి నిరోధకతను కూడా నాశనం చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ మాట్లాడుతూ.. వేగవంతమైన ఇన్ఫెక్షన్ కారణంగా మిలియన్ల మంది ప్రజలు చనిపోవచ్చని చెప్పారు. చైనాలోని ఆసుపత్రులు పూర్తిగా నిండిపోయాయని.. వచ్చే 90 రోజుల్లో చైనాలో 60 శాతానికిపైగా.. ప్రపంచ జనాభాలో 10 శాతం మందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఇన్ఫెక్షన్ వేగంగా పెరిగిన తర్వాత లక్షలాది మంది చనిపోయే అవకాశం ఉందని చెప్పారు. చైనాలో కరోనా ఆంక్షలు సడలించిన తరువాత భారీగా కేసులు పెరిగాయన్నారు. శ్మశానవాటిక వద్ద భారీ క్యూ.. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. కరోనాతో చనిపోయిన వారికి కేటాయించిన బీజింగ్లోని ఓ శ్మశాన వాటికల మృతదేహాలతో నిండిపోయింది.
అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు మృతదేహాలతో క్యూలో ఉన్నారు. చైనా రాజధాని తూర్పు అంచున ఉన్న బీజింగ్ డాంగ్జియావో శ్మశానవాటికలో అంత్యక్రియల కోసం అభ్యర్థనలు పెరిగాయి. కరోనా ఆంక్షలను సడలించడంతో రాజధాని నగరం అంతా వైరస్ వ్యాపించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. భారీ సంఖ్యలో మరణాల గురించి ముందస్తు సంకేతాలు వెలువడుతున్నాయని పేర్కొంది. అధికారికంగా చైనా బీజింగ్లో ఎటువంటి కోవిడ్ మరణాలను వెల్లడించకపోయినా.. ఇటీవల అంత్యక్రియల కోసం మాత్రం క్యూ కడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అధికారికంగా చైనాలో మరణాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఎపిడెమియాలజిస్టుల ప్రకారం.. బీజింగ్లో దహన సంస్కారాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. శవాగారాలు ఓవర్లోడ్గా ఉన్నాయి. దహన సంస్కారాల కోసం చాలా పెద్ద క్యూ ఉంది. కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా చైనా గత మూడు సంవత్సరాలుగా తన ‘సున్నా కోవిడ్’ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే లాక్డౌన్, కోవిడ్ టెస్ట్, క్వారంటైన్ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కేసులు వేగంగా పెరిగాయి. తక్కువ టీకా రేట్లు, అస్తవ్యస్తమైన అత్యవసర సేవల కారణంగా చైనాలోని పెద్ద జనాభా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. జీరో కోవిడ్ విధానాన్ని సడలించడం వల్ల చైనాలోని 1.4 బిలియన్ల జనాభాలో 10 లక్షల మంది చనిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
