హైదరాబాద్: నగరంలో జరిగిన ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ని సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు భగవంత్ సింగ్ మాన్ ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భగవంత్ సింగ్ మాన్కి సీఎం కేసీఆర్ పూల బొకే ఇచ్చి సాదర స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ప్రగతిభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భగవంత్ సింగ్ మాన్ భేటీ అయ్యారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలు, దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ఢిల్లీలో కేంద్రం vs కేజ్రీవాల్ సర్కారు అన్నట్టుగా జరుగుతున్న పరిణామాలు, పంజాబ్లో కొత్తగా ఏర్పడిన ఆప్ సర్కారు ఎదుర్కొంటున్న సవాళ్లు, గుజరాత్ ఎన్నికల ఫలితాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో పాటు రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తరువాత రెండు మిత్ర పక్షాలైన బిఆర్ఎస్, ఆప్ నేతల మధ్య జరుగుతున్న ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ బిఆర్ఎస్ పార్టీ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్చల అనంతరం సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్కి శాలువా కప్పి, మెమొంటో బహూకరించి ఘనంగా వీడ్కోలు పలికారు. త్వరలోనే సీఎం కేసీఆర్ సైతం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి బిఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు, అక్కడ ప్రధాన పార్టీలైన ప్రాంతీయ పార్టీలతో మిత్రపక్షాలుగా వ్యవహరిస్తూ కలిసి పనిచేయడం వంటి నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
