టీమిండియా పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 సంవత్సరంలో వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా సిరాజ్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం (డిసెంబర్ 7) బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో అనముల్ హక్ వికెట్ తీయడంతో సిరాజ్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2022లో ఇప్పటివరకు 14 వన్డే మ్యాచ్లు ఆడిన సిరాజ్.. 23 వికెట్లు పడగొట్టాడు. 2022లో వన్డే మ్యాచ్లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా మహ్మద్ సిరాజ్ ఉండగా.. రెండో స్థానంలో మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చహల్ ఉన్నాడు. 2022 వన్డేల్లో 14 మ్యాచ్లు ఆడిన చహల్ 21 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు ఈ రికార్డు చహల్ పేరుపై ఉంది.
చహల్ 21 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సిరాజ్ 18 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి వన్డేలో 3 వికెట్స్ పడగొట్టిన సిరాజ్.. రెండో వన్డేలో రెండు వికెట్లు తీశాడు. దాంతో చహల్ను వెనక్కి నెట్టి టాప్లోకి దూసుకొచ్చాడు. బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (82) టాప్ స్కోరర్గా నిలవగా.. రోహిత్ శర్మ (51) ఇన్నింగ్స్ చివరలో హాఫ్ సెంచరీతో పోరాడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసింది. మెహిదీ హసన్ (100 నాటౌట్) సెంచరీ చేశాడు.
