దేశంలో జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఒకటి దక్కించుకున్నాయి. కాగా బీజేపీ ఓ రాష్ట్రాన్ని కోల్పోయినట్టైంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాత ఆచారం కొనసాగింది. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేసే ప్రజల నిర్ణయం మరోసారి రిపీట్ అయింది. అధికార బీజేపీని అక్కడి ప్రజలు ఈసారి దూరం పెట్టేశారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో అధికారానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లతో ఘన విజయం నమోదు చేసింది. అధికార పార్టీ బీజేపీ మాత్రం 25 సీట్లకు పరిమితమై..ప్రతిపక్షపాత్ర పోషించేందుకు సిద్ధమైంది.
ఓటమిని అంగీకరించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామాను గవర్నర్కు పంపించారు. ప్రజాతీర్పును శిరసావహిస్తానన్నారు. జైరాం ఠాకూర్ మాత్రం తన సొంత నియోజకవర్గం సిరాజ్ నుంచి ఘన విజయం సాధించారు. హిమాచల్ ఎన్నికల్లో బీజేపీకు రెబెల్స్ బెడద కూడా తాకింది. ఎందుకంటే గెల్చిన ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్ధుల్లో ఇద్దరు బీజేపీకు చెందినవారు కాగా, ఒకరు కాంగ్రెస్ పార్టీకు చెందిన నేతగా ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్ని గెల్చుకోగా, కాంగ్రెస్ 21 స్థానాలకు పరిమితమైంది. అంతకుముందు అంటే 2012లో కాంగ్రెస్ 36 స్థానాలు గెల్చుకోగా బీజేపీ 26 స్థానాలు గెల్చుకుంది. ఇతరులు 6 చోట్ల విజయం సాధించారు. ఈసారి ఇతరులు 3 చోట్ల గెలిచారు.
