Latest Posts

మాండస్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాను దిశ మార్చుకుంటోంది. ఉత్తర తమిళనాడు వద్ద నిన్ననే తీరం దాటాల్సిన తుపాను దిశ మార్చుకుని బలపడుతోంది. డిసెంబర్ 10 ఉదయం నాటికి తీరం దాటవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

మాండస్ తుపాను అంతకంతకూ బలపడుతోంది. వాతావరణశాఖ అంచనాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ప్రస్తుతం పుదుచ్చేరి కరైకల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఉన్న మాండస్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారింది. చెన్నై వాతావరణ శాఖ ప్రకారం ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.

మాండస్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనుండగా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో కూడా అతి భారీవర్షాల హెచ్చరిక ఉంది. భారీ వర్షాల హెచ్చరిక నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి..అప్రమత్తంగా ఉండాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు.

మరోవైపు తమిళనాడులోని ఆరు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై నుంచి సింగపూర్, ముంబై వెళ్లాల్సిన 11 విమానాలను దారి మళ్లించారు.

Posted Under AP
Editor