మహిళల భద్రతకు ‘శక్తి’ కవచం: కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు భరోసా

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

మహిళలు మరియు బాలబాలికల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు. అనంతపురం జిల్లా కణేకల్లు మండల కేంద్రంలో మహిళా రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ‘శక్తి యాప్’ ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

కణేకల్లు మండల కేంద్రంలోని చిక్కణ్ణేశ్వర ఫంక్షన్ హాల్ వేదికగా మహిళలు మరియు బాలబాలికల భద్రతపై కీలక సదస్సు జరిగింది. స్థానిక ఎస్సై నాగమధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళల రక్షణే పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘శక్తి యాప్’ మహిళలకు ఒక కవచంలా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఆపద సమయంలో ఉన్న మహిళలు ఈ యాప్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. నిమిషాల్లోనే పోలీసులు వారి వద్దకు చేరుకుంటారని భరోసా ఇచ్చారు. ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.

Posted Under AP
Editor