Latest Posts

సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రేసులో మాజీ పేసర్‌ వెంకటేష్ ప్రసాద్

టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీఫైనల్ నుంచే భారత్ ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. టైటిల్ ఫెవరెట్ అయిన రోహిత్ సేన ఇంగ్లండ్ జట్టుపై దారుణ పరాభవం ఎదుర్కోవడంతో బీసీసీఐ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. చేతన్‌ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. ఇక కొత్త ప్యానల్‌ కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. బీసీసీఐ నామినేషన్ల గడువు సోమవారం (నవంబర్‌ 28)తో ముగిసింది. బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం వెంకటేష్ ప్రసాద్, నయన్ మోంగియా, మణిందర్ సింగ్, అజయ్ రాత్ర, శివ సుందర్ దాస్ వంటి భారత మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న చేతన్ శర్మ, సెలక్టర్ హర్విందర్ సైతం మరలా దరఖాస్తు చేస్తారు.

అయితే సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రేసులో మాజీ పేసర్‌ వెంకటేష్ ప్రసాద్ ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత జానియర్‌ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ప్లస్ కానుంది. బీసీసీఐ కూడా వెంకటేష్ అయితే బాగుంటుందని భావిస్తోందట. 2016-18 మధ్య కాలంలో జూనియర్ భారత్ చీఫ్ సెలెక్టర్‌గా వెంకటేష్ ప్రసాద్ పనిచేశాడు. వెంకటేష్ జట్టుతో ఉండగా.. 2018లో అండర్‌ 19 ప్రపంచకప్‌ను యువ భారత జట్టు గెలుచుకుంది. ఇక టీ20 ప్రపంచకప్‌ 2007ను కైవసం చేసుకున్న భారత జట్టుకు బౌలిం‍గ్‌ కోచ్‌గా కూడా వెంకటేష్ పనిచేశాడు. వెంకటేష్ ప్రసాద్ ​భారత్ తరపున 161 వన్డేలు, 33 టెస్టు ఆడాడు. వన్డేల్లో 196, టెస్టుల్లో 96 వికెట్లు పడగొట్టాడు. రోజర్ బిన్నీ నేతృత్వంలో సెలక్షన్ ప్యానెల్‌ను త్వరలోనే ఎంపిక చేయనున్నారు.

Editor