ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై పడనుందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 5న అల్పపీడనం ఏర్పడనుంది. డిసెంబర్ 7వ తేదీనాటికి క్రమంగా వాయుగుండంగా మారనుంది. ఆ తరువాత నైరుతి బంగాళాఖాతంలో చేరనుంది. 8వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రకు చేరనుందని ఐఎండీ వెల్లడించింది.
వాస్తవానికి ఈ వాయుగుండం ప్రభావం దక్షిణ తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాలపై ఉంటుందని భావించినా..ఆ తరువాత దిశ మార్చుకుని దక్షిణ కోస్తాంధ్రవైపుకు వస్తుందని తెలిసింది. ఫలితంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా పడనున్నాయి. రానున్న మూడ్రోజులు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణ ఉండవచ్చు. దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం ఒకట్రెండు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చు. ఇక రాయలసీమలో రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలుల ప్రభావంతో చెదురు ముదురు వర్షాలు పడనున్నాయి.
