అనంతపురం జిల్లా..
రాయదుర్గం నియోజకవర్గం..
వైభవంగా శ్రీ జగన్నాథ రథోత్సవం..
రాయదుర్గం పట్టణంలో శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్ర దేవేరుల రథోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. “హరే రామ హరే రామ… హరే కృష్ణ హరే కృష్ణ…” అనే నామస్మరణతో పట్టణ పురవీధులన్నీ మారుమ్రోగాయి. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారుల కోలాహలం, భజనలు, కీర్తనలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.
ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా హాజరై శ్రీ జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథయాత్రలో పాల్గొని భక్తులకు అభివాదం చేశారు.
భారీ భక్తజన సందోహం మధ్య శ్రీ జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రల దివ్య రథం పట్టణ ప్రధాన వీధుల గుండా వైభవంగా ఊరేగింది. భక్తులు “జై జగన్నాథ్” నినాదాలు చేస్తూ రథాన్ని లాగేందుకు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. భజనలు, కీర్తనలు, హరినామ సంకీర్తనలతో రథయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేశారు.
భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ శ్రీ జగన్నాథ రథోత్సవం రాయదుర్గం ప్రజలకు కనుల పండుగగా నిలిచి, భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.
