తాడిమర్రి( yes9tv )వేరుశనగ పంపిణీ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి
తాడిమర్రి, జూన్ 9:
ఖరీఫ్-2026 సీజన్లో రైతులకు 40 శాతం రాయితీపై అందించనున్న వేరుశనగ విత్తనాల పంపిణీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తాడిమర్రి మండల వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ మేరకు మండలంలోని రైతు సేవా కేంద్రాల అధికారులతో మంగళవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాలు, రైస్ మిల్లులు, రచ్చబండలు, దేవాలయాల మైక్ సెట్లు, టామ్టామ్లు తదితర ప్రచార మాధ్యమాల ద్వారా వేరుశనగ విత్తనాల పంపిణీపై సమాచారం అందించాలని తెలిపారు. 40 శాతం రాయితీతో విత్తనాలు పొందాలనుకునే రైతులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయితే మండలానికి వేరుశనగ విత్తనాల సరఫరా త్వరితగతిన ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు విత్తనాలను నేరుగా విత్తకుండా తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలని సూచించారు.
ప్రస్తుతం వేరుశనగ పంటలో మువ్వకుళ్లు, వేరుకుళ్లు వంటి తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తున్నందున, కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల చొప్పున క్లోరోపైరిఫాస్ మరియు ఇమిడాక్లోప్రిడ్ మందులను ఉపయోగించాలని తెలిపారు. అదేవిధంగా కిలో విత్తనానికి 4 నుండి 5 గ్రాముల శిలీంద్రనాశిని మందు కలిపి విత్తన శుద్ధి చేయాలని సూచించారు. ఈ విధంగా శుద్ధి చేసిన విత్తనాలను విత్తినట్లయితే పంట వేసిన తరువాత 45 రోజుల వరకు చీడపీడల బెడద తగ్గుతుందని వివరించారు.
అలాగే ఏపీ ఐఎంఎస్, ఏపీఎస్ఆర్ఎస్, కౌలు రైతుల నమోదు, మట్టి నమూనాల సేకరణ తదితర కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
మండలంలోని రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందితో సమన్వయంతో పనిచేసి అవసరమైన సలహాలు, సూచనలు పొందాలని కోరారు.
మండలానికి 1,840 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల కేటాయింపు
ఖరీఫ్-2026 సీజన్కు తాడిమర్రి మండలానికి మొత్తం 1,840 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించారు. ఇందులో:
K-6 రకం – 1,100 క్వింటాళ్లు
సాధారణ ధర: రూ.3,060
40% రాయితీ తరువాత రైతు ధర: రూ.1,836
K-1812 రకం – 90 క్వింటాళ్లు
సాధారణ ధర: రూ.2,850
40% రాయితీ తరువాత రైతు ధర: రూ.1,710
TCGS-31694 రకం – 650 క్వింటాళ్లు
సాధారణ ధర: రూ.3,060
40% రాయితీ తరువాత రైతు ధర: రూ.1,836
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే తమ సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
వేరుశనగ పంపిణీ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి..
