కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుంది. ఉన్నదున్నట్టు ఓపెన్గా చెబితే.. ఎవరైనా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అదే చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగా లేదని.. అప్పు పుట్టట్లేదని.. మనల్ని ఎవరూ నమ్మట్లేదని.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవారు. తెలంగాణ చేతిలో ఉన్నది కేవలం 18వేల 500 కోట్లు మాత్రమేనని.. సహకరించాలంటూ ఉద్యోగ సంఘాలను రిక్వెస్ట్ చేశారు. సీఎం రేవంత్ అలా ఉన్నది ఉన్నట్టు చెప్పడంపై ప్రత్యర్థి పార్టీలు నానారచ్చ చేస్తున్నా.. ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం అర్థం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని మన్నించాయి. ప్రభుత్వంతో సుధీర్ఘంగా చర్చలు జరిపాయి. ఆ చర్చలు సఫలం అయ్యాయి. సమ్మె వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. సంస్థ శ్రేయస్సు దృష్ట్యా సమ్మె వాయిదా వేసిన జేఏసీ నాయకులకు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ప్రభుత్వం తరఫు వాదన
ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు చర్చలు జరిపారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని తెలిపారు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చామని.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నిలబెడుతున్నామని.. ఈ సమయంలో సమ్మె సరికాదని చెప్పారు. TGSRTC ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ. 400 కోట్లు చెల్లించామని.. పెండింగ్ పీఎఫ్ అమౌంట్ రూ.1039 కోట్లు సైతం చెల్లించామని చెప్పారు. ccs బకాయిలు 345 కోట్లు క్లియర్ చేశామని.. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టామని.. 3038 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అనుమతి ఇచ్చామని గుర్తు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను మరోసారి వినిపించింది జేఏసీ. ఆ చర్చలు సఫలం కావడంతో.. ప్రభుత్వం మీద నమ్మకంతో సమ్మెను తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించాయి. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని తేల్చి చెప్పాయి ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాలు.
ఆర్టీసీ జేఏసీ డిమాండ్స్ ఇవే..
RTC యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తామని.. ఉద్యోగ భద్రతపై సర్క్యూలర్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. భారత్, పాక్ యుద్ధ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం వివరించిందని.. పంతాలకు పట్టింపులకు పోకుండా సమ్మెను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. గుర్తింపు సంఘాల ఎన్నికలు వెంటనే జరపాలని జేఏసీ కోరగా.. విడతల వారిగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఐఏఎస్ల కమిటీ ఏర్పాటు
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముగ్గురు ఐఏఎస్లు.. నవీన్ మిత్తల్, లోకేశ్ కుమార్, కృష్ణ భాస్కర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.