అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్రెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు వచ్చినట్టయింది.
న్యాయవ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాల: సబితా
ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషిగా తేలడంతో ఆమె న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పన్నెండున్నర ఏళ్ల కింద కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని.. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లు ఎక్కానని అన్నారు. ఆ రోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు ఓ రకమైన బాధను అనుభవించానని చెప్పారు. ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన నమ్మకం కలిగిందని ఆమె చెప్పుకొచ్చారు. ‘ఆ రోజు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. గత పన్నెండేళ్ల నుంచి ఎన్నో అవమానాలు భరించాను. అవినీతిపరురాలినని.. కేసులలో ఉన్నానని.. ప్రతిపక్షాలు ఎన్నో ప్రచారాలు చేసింది’ అని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
2004-09లో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఓబులాపురం మైనింగ్ తవ్వకాల్లో ఆక్రమాలు జరుగుతున్నాయని.. ఓఎంసీ అక్రమ మైనింగ్ కు పాల్పడుతోందని 2009 లో అప్పటి ఏపీ గవర్నమెంట్ చేసిన కోరిక మేరకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. 2007 డిసెంబర్ 7వ తారీఖును సీబీఐ కేసు నమోదైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓఎంసీ కేసులో సీబీఐ మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఆ ఛార్జ్ షీట్ లో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి, గాలి జనార్ధన్ రెడ్డి దగ్గరి మనిషి మెఫజ్ అలీ ఖాన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తదితర్ల పేరులు ఉన్నాయి. ఈ ముగ్గురితో పాటు గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, వీడీ రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం పై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ఓఎంసీ మైనింగ్ కేసులో సుదీర్ఘమైన విచారణ తర్వాత గడిచిన నెలలో దర్యాప్తు ఓ కొలిక్కి రాగా.. ఈ కేసు విచారణను 2025 మే నెలలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది.
జైలు జీవితం గడిపిన ఐఏఎస్ శ్రీలక్ష్మీ
ఎట్టకేలకు ఈ రోజు ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి మూడేళ్ల కిందనే (2022లోనే) ఊరట లభించింది. ఈ కేసులో కొన్ని నెలల పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలు జీవితం కూడా గడిపింది. అయితే.. ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ సరైన ఆధారాలు సమర్పించలేకపోవడంతో తెలంగాణ హైకోర్టు ఆమెపై దాఖలైన ఛార్జ్ షీట్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.