ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. ఎన్నో నెలలుగా ఎదురుచూపులో ఉన్న సామాన్య కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేద కుటుంబాలకు వరంగా గల రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ప్రకటన జారీ చేశారు.
మార్చిలో నిలుపుదల.. ఇప్పుడు ప్రారంభం
ఏపీలో నూతన రేషన్ కార్డ్స్ చారి చేసే ప్రక్రియను గత ఏడాది మార్చిలో నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఎందరో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ లబ్ధి పొందలేక నూతన రేషన్ కార్డ్ జారీకై ఎదురుచూపుల్లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి 46 లక్షల 21 వేల 223 రేషన్ కార్డులు ఉండగా, ఇంకా కొత్తగా రేషన్ కార్డును పొందేందుకు అర్హులు లక్షల సంఖ్యలో ఉన్నారని చెప్పవచ్చు. వారిని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
94.4 శాతం ఈ కేవైసీ పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రేషన్ కార్డు గల అన్ని కుటుంబాలకు ఈకేవైసీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ కేవైసీ పూర్తి చేయని రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులో నిలుపుదల చేస్తామని పలుమార్లు ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో, ఈ కేవైసీ ప్రక్రియ వేగవంతంగా సాగిందని చెప్పవచ్చు. ఇదే విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 94.4 శాతం ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రకటించారు.
వారికి ఈకేవైసి అవసరం లేదు
సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులో పేరు ఉండి, వేలిముద్రలు పడని చిన్నారులు, వృద్ధులకు ఈకేవైసీ నుండి మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. దీనితో 6,45,767 మందికి ఇలాంటి పరిస్థితులలో ఈకేవైసీ మినహాయించడం జరిగిందన్నారు.
ఏడవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డ్స్ ప్రక్రియ ప్రారంభం..
రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియను ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. అలాగే పాత రేషన్ కార్డులలో పేరు మార్పులు, చేర్పులతో పాటు రేషన్ కార్డ్స్ బదిలీలకు సైతం కార్డుదారుల కు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అలాగే చిరునామా మార్పుకు కూడా అవకాశం ఉందన్నారు. అర్హులు తమ దరఖాస్తులను సచివాలయంలో పొందవచ్చని నాదెండ్ల తెలిపారు. అర్హులకు జూన్ మాసంలో కొత్త కార్డులు జారీ చేస్తామని, అలాగే వచ్చే సోమవారం నుండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తామన్నారు.
స్మార్ట్ కార్డ్ తరహా కొత్త కార్డు
రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసే రేషన్ కార్డును స్మార్ట్ కార్డు తరహాలో అందజేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని, దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకొనే సదుపాయాన్ని ఏపీ ప్రజల ముందుంచినట్లు మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏడవ తేదీ నుండి నూతన రేషన్ కార్డుల ప్రక్రియ ఊపందుకోనుందని చెప్పవచ్చు. మొత్తం మీద మీకు అర్హత ఉంటే చాలు.. నూతన రేషన్ కార్డు తప్పనిసరిగా జారీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మరి మీకు అర్హత ఉందా.. నేరుగా దరఖాస్తు చేయండి మరి.