పేపర్ లీక్ ఎపిసోడ్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మార్చి 5న జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకు అయినట్లు పోలీసుల విచారణలో బయటపడిన తర్వాత పరీక్ష రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ పరీక్షకు త్వరలో మరో కొత్త తేదీని ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
కాగా పేపర్ లీక్ అయినట్లు తేల్చిన పోలీసులు.. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని ఇప్పటికే కమిషన్ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ యధాతథంగా ఉంటుందని వెల్లడించారు. సాక్ష్యాలు లేకుండా నిర్ణయాలు తీసుకోలేమన్నారు చైర్మన్. నమ్మిన వాళ్ళే గొంతు కోశారని ఛైర్మన్ జనార్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నివేదిక ఆధారంగానే పరీక్షలపై తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు.