ఏపీలో నామినేటెడ్ పోస్టులు.. ఫీల్డ్ నేతలకే సీఎం చంద్రబాబు ఛాన్స్..!

ఏపీలో నామినేటెడ్ పోస్టులపై ముఖ్యనేతలు ఫోకస్ పెట్టారు. తమకు మంత్రి పదవులు రాకపోయినా తమ ఫ్యామిలీ మెంబర్స్ లేదా అనుచరులకు కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులను ఇప్పించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల నుంచి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు‌నాయుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కార్యకర్తల నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. జిల్లాల్లోని ముఖ్యనేతలు తమ వారసులకు పదవులను ఇప్పించుకోవాలని ఆరాటపడుతున్నారు. మరికొందరు నమ్మినబంటులుగా ఉన్న అనుచరుల కోసం మంతనాలు మొదలుపెట్టారు.

 

సీఎం చంద్రబాబు ఆలోచన ఈసారి మరోలా ఉందని నేతలు చెబుతున్నారు. గతంలో ఉన్న నేతలు ఇప్పుడున్నారని, కొత్త లీడర్‌షిప్‌‌ను బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో యువకులపై ఫోకస్ పెట్టారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందిపడిన నేతలపై ఆరా తీస్తున్నారు. పార్టీ కోసం పోరాటం చేసినవారిని, దిగువస్థాయి కార్యకర్తలతో అనుసంధానమైన వారి కోసం సమాచారాన్ని రప్పించు కున్నారట. ఈ నేపథ్యంలో చాలామంది నేతలు మంత్రి నారా లోకేష్‌తో మంతనాలు సాగిస్తున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం.

 

చాలామంది నేతలు ఫీల్డ్‌లోకి వెళ్లకుండా కేవలం పేపర్‌లో ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి ఫీల్డ్‌లో ఉన్న యువనేతలకు అవకాశం ఇవ్వాలన్నది అధినేత ఆలోచనగా చెబుతున్నారు. పేపర్‌కి పరిమితమైన నేతలకు జిల్లాలో పదవులను అప్పగించాలని భావిస్తున్నట్లు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. చంద్రబాబు తన కేబినెట్‌లోకి కొత్తగా మంత్రులు తీసుకున్న ట్టుగానే ఈసారి నామినేటెడ్ పోస్టులకు యువకులు, ఫీల్డ్ నేతలను తీసుకోవాలనే ఆలోచనగా చెబుతున్నాయి పార్టీ వర్గాలు.

 

గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కో కులానికి ఒక్కో ఛైర్మన్ పదవి ఇచ్చేశారు. ఆయా నేతలకు పదవులు తప్పితే .. కనీసం ఐదేళ్లలో వారి ఆఫీసు ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈసారి అలాకాకుండా కేవలం 50 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు మాత్రమే పరిమితం చేయాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది.

Posted Under AP
Editor