ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘బీఎఫ్7’ కలవరపెడుతున్న విషయం తెలిసిందే. కరోనా తొలిసారి వెలుగు చూసిన చైనాలో ఈ వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. ఒమిక్రాన్ ఉపరకమైన బిఎఫ్7 విజృంభణకు చైనాలో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ బిఎఫ్7 భారత దేశంలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు 3 నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్లో రెండు కేసులు నమోదు కాగా.. ఒడిశాలో ఓ కేసు నమోదు అయింది. కరోనా వైరస్ బీఎఫ్7 వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. వెంటనే కరోనా నివారణ చర్యలను చేపట్టాలని కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలను దృష్టిలో ఉంచుకుని జనాలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక బయటికి వచ్చిన ప్రతిఒక్కరూ.. తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. అంతేకాదు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. చైనాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి శనివారం ఉదయం నుంచి కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన వారిని విమానాశ్రయాల్లోనే కరోనా టెస్ట్ కేంద్రాలకు తరలిస్తారు. ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. ఆ సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిస్తారు. కరోనా పరీక్షల కోసం ఆరు రిజిస్ట్రేషన్ కౌంటర్లు, మూడు నమూనా బూత్లను ఏర్పాటు చేసినట్లు ముంబై విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది.
