దేశంలో రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూ.. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకుచ్చింది. ఆగస్టు 2023 నాటికి దేశంలోని 75 నగరాలను సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్తో అనుసంధానించే దిశగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని ఐదు వేర్వేరు మార్గాల్లో వందేభారత్ రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లు నడపడంతో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం ఏర్పడింది. ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని అధిగమించవచ్చు. రాబోయే కాలంలో ఇంటర్సిటీ, శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందే భారత్ రైళ్లు వస్తాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రయాణికులకు మరో గుడ్న్యూస్ రాబోతుంది. రాబోయే కాలంలో వందేభారత్ రైలు వేగాన్ని మరింత పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతికతను మార్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీని వల్ల మలుపు వద్ద రైలు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండదు.
అంతేకాకుండా రైలు ఒకే వేగంతో ట్రాక్ను దాటుతుంది. రాబోయే నాలుగో వంతు రైళ్లలో రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త టెక్నాలజీని అమలు చేయనుంది. ఈ సరికొత్త టెక్నాలజీతో రైలు మునుపటి కంటే వేగంగా వెళుతుందని.. ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇంకా కాస్త తక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రైలు వంకరగా ఉన్న ట్రాక్లో వేగాన్ని తగ్గిస్తుండడంతో.. రైలు సగటు వేగం తగ్గతోంది. రైలు ప్రయణానికి కూడా కాస్త సమయం పడుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో రైలు అధిక వేగంతో మలుపు వద్ద ప్రయాణించనుంది. ప్రస్తుతం ఉన్న ట్రాక్లోనే ‘టిల్ట్ టెక్నాలజీ’తో వందే భారత్ రైలును నడపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ 400 రైళ్లలో 100 సుదూర రైళ్లలో ‘టిల్ట్ టెక్నాలజీ’ని ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఇటలీ, రష్యా, స్విట్జర్లాండ్, చైనా, జర్మనీ తదితర దేశాల్లో ఈ టెక్నాలజీతో రైళ్లు నడుస్తున్నాయి.
