ఏపీ ప్రభుత్వం రోజురోజుకూ ఆరోగ్యశ్రీ సేవల్ని విస్తరిస్తోంది. ఇక నుంచి రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి సైతం ఆరోగ్యశ్రీలో..ఏ విధమైన నిబంధనల్లేకుండా చికిత్స అందేలా ఉత్తర్వులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ఆరోగ్యశ్రీ పధకంలో ఇకపై క్యాష్లెస్ చికిత్స అందించనున్నామని ప్రభుత్వం వెల్లడించింది. రోడ్డు ప్రమాద బాధితులకు ఆరోగ్య శ్రీ కార్డు లేకపోయినా…లేదా పొరుగు రాష్ట్రానికి చెందినవారైనా ఆరోగ్య శ్రీ పథకం కిందే చికిత్స జరగనుంది. దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 303 విడుదలైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిస్థితిపై ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జరిగిన సమీక్షలో మరణాల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు. ఈ సమీక్షలో భాగంగా ఇవాళ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ఆరోగ్య శ్రీ పధకం కింద పూర్తి చికిత్స అందనుంది. అంతేకాదు..ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా చికిత్స అందించవచ్చు. రాష్ట్రంలోని ప్యానెల్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా అందించాల్సిందిగా ఉత్తర్వుల్లో ఉంది. ఏపీకు చెందిన రోడ్డు ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద ఇక నుంచి చికిత్స అందాలి. జాతీయ పథకం అమలయ్యేంతవరకూ..ఆరోగ్యశ్రీ కార్డుతో నిమిత్తం లేకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించాలి. దీనికి సంబంధించి ఇతర మార్గదర్శకాల్ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
