ముదిగుబ్బలో పంచాయతీరాజ్ దినోత్సవం

ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ, ఏప్రిల్ 24: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముదిగుబ్బ గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ప్రాముఖ్యతపై ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. 1993 ఏప్రిల్ 24న రాజ్యాంగ 73వ సవరణ అమల్లోకి రావడంతో గ్రామ స్థాయి ప్రజాస్వామ్యానికి బలమైన పునాది పడిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలే తమ అభివృద్ధి నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తోందని వివరించారు.
గ్రామ సభలు, ప్రజా సమావేశాలు నిర్వహించి గ్రామాభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించడం అవసరమని సూచించారు. గ్రామాల్లో స్వయం సమృద్ధి సాధనకు పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
అనంతరం గ్రామ సచివాలయం–2లో సేవలందిస్తున్న ఉత్తమ పంచాయతీ కార్మికులను సన్మానించి వారి సేవలను ప్రశంసించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో శకుంతల, డీటీ నారాయణస్వామి, డిఫ్యూటీ ఎంపీడీఓ మంజులాదేవి కూటమి నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు

Posted Under AP
Editor