తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలం, పట్రపల్లిలో ఘనంగా బీజేపీ శిక్షణ మహా అభియాన్ తాడిమర్రి మండలం పట్రపల్లి గ్రామంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్–2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిమర్రి బీజేపీ మండల అధ్యక్షులు దేవర రాము అధ్యక్షత వహించగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే శ్రీ సత్య కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, వివిధ మోర్చాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతపరంగా బలంగా ఉండడం పార్టీ ఎదుగుదలకు ఎంతో అవసరమని తెలిపారు. కార్యకర్తలు ప్రజలతో నిత్యం అనుబంధం పెంచుకుని గ్రామ స్థాయి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల మధ్య పనిచేసే కేడర్ ఉన్నప్పుడే పార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందుతుందని అన్నారు.
రెండు సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదగడం పార్టీ సిద్ధాంతాల బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో భద్రతా సమస్యలు ఉన్న దేశం నేడు సురక్షితంగా మారి ప్రజలు స్వేచ్ఛగా జీవించే స్థితి ఏర్పడిందని అన్నారు.
భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశ అభివృద్ధి, జాతీయత, సేవా భావంతో ముందుకు సాగే జాతీయ ఉద్యమమని మంత్రి వివరించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సమగ్ర మానవతావాదం (ఇంటెగ్రల్ హ్యూమనిజం) సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని సూచించారు.
పట్రపల్లిలో ఘనంగా బీజేపీ ‘శిక్షణ మహా అభియాన్’: ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్య కుమార్ యాదవ్
