తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి జనసేన పార్టీ తన మద్దతును ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు ఇతర నాయకులు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిలను కలసి తమ మద్దతును తెలిపారు.
మాగంటి గోపీనాథ్ అకాల మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణలోనూ జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం గమనార్హం.
ఎన్నికల ప్రచారానికి మరో నాలుగైదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో, జనసేన నాయకులు వెంటనే దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇరు పార్టీల నాయకులు పరస్పరం కండువాలు మార్చుకుని, ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి తమ నిబద్ధతను తెలియజేశారు.
