కోల్ కతా హత్యాచారం కేసు… 42 మంది డాక్టర్లపై బదిలీ వేటు..

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఏకంగా 42 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ ఆరోగ్య శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

 

మరోవైపు, ఇంతమంది వైద్యులను బదిలీ చేయడంపై మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిరసన ఉద్యమంలో పాల్గొన్నందుకు శిక్షగానే ఇంత మందిని బదిలీ చేశారని విమర్శించారు.

 

ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని యునైటెడ్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. డాక్టర్ల బదిలీలు పూర్తిగా అన్యాయమని తెలిపింది. హత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, విధుల్లో ఉన్న వైద్యులకు భద్రత కల్పించాలంటూ తాము కోరుతున్న డిమాండ్లపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.

Editor