Latest Posts

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు జవాన్లు మృతి..

జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు మృతి చెందగా.. ఆరుగురికి గాయీలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారలు వెల్లడించారు. దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్, కార్డన్ ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు.

 

కశ్మీర్‌లో గత కొన్ని వారాలుగా ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. జూన్ 11, 12 తేదీల్లో దోడా జిల్లా జంట ఉగ్రదాడులతో దద్దరిల్లింది. అంతేకాకుండా జూన్ 11న, చత్తర్‌గల్లా వద్ద జాయింట్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇక జూన్ 12న గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.

 

దాడుల తరువాత, భద్రతా బలగాలు తమ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. జిల్లాలో చొరబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు అధికారులు.

 

ఇదిలావుండగా, దక్షిణ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను ముట్టుబెట్టడంతో హిజ్బుల్-ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆర్‌ఆర్ కమాండర్ బ్రిగేడియర్ పృథ్వీరాజ్ చౌహాన్ సోమవారం ప్రకటించారు. ఈ ఆపరేషన్లలో, ఒక ఆర్మీ సిబ్బంది తన ప్రాణాలను త్యాగం చేశారు.

Editor