ఇటీవల హథ్రాస్ జరిగిన తొక్కిసలాటలో 121 ప్రాణాలు కోల్పోయిన ఘటనపై గురువారం అలీగఢ్ ఐజీ షలాబ్ మాథుర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారని తెలిపారు. ఈ తొక్కిసలాటపై విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు మహిళలు సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
భోలే బాబాకు సంబంధించి క్రిమినల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు ఐజీ మాథుర్ తెలిపారు. సత్సంగ్ కోసం బాబా తన పేరు మీద కాకుండా వేరొకరి పేరు మీద పర్మిషన్ తీసుకున్నారని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో సేవాదార్లుగా వ్వవహరించిన ఉపేంద్ర, మంజూ యాదవ్, ముకేశ్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు ఐజీ స్పష్టం చేశారు.
చీఫ్ సేవాదార్గా ఉన్న దేవ్ ప్రకాశ్ మధుకర్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు ఐజీ తెలిపారు. అతని మీద లక్ష రూపాయల రివార్డ్ కూడా ప్రకటించినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన ఆరుగురు ఘటన జరగగానే తప్పించుకున్నారని.. విచారణకు సహకరించలేదని ఐజీ చెప్పారు.
ఇక మెయిన్పురీలోని భోలే బాబా ఆశ్రమానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులు ఆశ్రమానికి చేరుకున్న సమయంలో బాబా అక్కడ లేడని చెప్పారు.
