Latest Posts

అమలులోకి కొత్త చట్టాలు..! రాజధానిలో తొలి కేసు..!

మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట. ఈ చట్టం సామాన్యులకు గుదిబండగా మారుతుందని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు గొంతెత్తారు. అయినా మోదీ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మరీ ఈ చట్టాలను పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదించుకుంది.

 

జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఈ చట్టం పవరేంటో గానీ, అమల్లోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. అదీ కూడా వీధి వ్యాపారిపై ఈ కేసు రిజిస్టర్ అయ్యింది. కొత్త క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

ఢిల్లీలోని కమల మార్కెట్ ఏరియాలో వీధి వ్యాపారి వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్ముతాడు. వెండర్ తాత్కాలిక దుకాణం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది. దానివల్ల రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ దుకాణాన్ని వేరే చోటకు తరలించాలని పోలీసులు పలుమార్లు చెప్పారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన పోలీసులు అందుకు సంబంధించి వీడియోను తీసి కేసు నమోదు చేశారు.

 

నిందితుడి పేరు పంకజ్‌కుమార్ కాగా, సొంతూరు బీహార్‌కు చెందినవాడు. కొత్త చట్టం ప్రకారం కేసు విచారణ పూర్తయి 45 రోజుల్లోపు కచ్చితంగా తీర్పు చెప్పాల్సిందే. తొలి విచారణ జరిగిన 60 రోజల్లోపు అభియోగాలు నమోదు కావాలి. మొత్తానికి కొత్త చట్టాలు ద్వారా పోలీసులు వేగంగా విచారణ చేయడమేకాదు, న్యాయస్థానాలు త్వరగా తీర్పును వెల్లడించనున్నాయి.

Editor