బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని ఇటీవల కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అడ్వకేట్ జనరల్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు కేసీఆర్ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ కోర్టు పిటిషన్ వేశారు. కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
కేసీఆర్ తరపు లాయర్ల వాదనలను హైకోర్టు విభేదించింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు సమర్థించింది. ఇరు వాదనలు తర్వాత విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లతో జరిగిన అవకతవకలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ కమిషన్ నియమించింది. ఈ మేరకు విచారణ ప్రారంభించిన ఈ కమిషన్..మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్రను తెలియజేయాలని కోరింది. అయితే సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్కు జూన్ 15వరకు సమయం ఇచ్చింది. దీంతో కేసీఆర్ కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు అయిందని కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోందీ వాదనలు వినిపించారు. కాగా, పద్ధతి ప్రకామే విచారణ జరుగుతోందని, ట్రాన్స్ కో, జెన్ కో అధికారులను సైతం కమిషన్ విచారించిందని ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. దీంతో ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించి కేసీఆర్ రిట్ పిటిషన్ను కొట్టి వేసింది.
