లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయనను స్పీకర్గా ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీర్మానం పెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్తోపాటు పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు.
అటు ఇండియా కూటమి తరపున కె. సురేష్ పేరును ఉద్ధవ్థాక్రే వర్గం ఎంపీ అరవింత్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. చివరకు మూజువాణి ఓటుతో స్పీకర్గా ఓం బిర్లా గెలిచినట్టు ప్రకటించారు ప్రొటెం స్పీకర్. మరోవైపు స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని నరేంద్రమోదీ, విపక్ష నేత రాహుల్గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ని దగ్గరుండి తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు.
దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఎంపీ కూడా వరుసగా రెండుసార్లు స్పీకర్గా వ్యవహరించిన సందర్భం రాలేదు. ఆ ఛాన్స్ ఓం బిర్లాకు మాత్రమే దక్కింది. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లాపై విపక్షాల అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ కొడికునిల్ సురేశ్ పోటీ చేశారు. అంతకుముందు స్పీకర్ పదవికి 1952, 1967, 1976లో మాత్రమే మూడుసార్లు ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే.
2014, 2019లో బీజేపీ ఎంపీలే లోక్సభలో స్పీకర్గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్గా ఎవరులేరు. 2019లో సభను నడిపించే అనుభవం లేకపోయినా నడిపిన తీరు ప్రశంసనీయం. ఆయన హయాంలో ఆర్టికల్ 370, సీఏఏ సవరణ చట్టం, మూడు క్రిమినల్ చట్టాల అమలు జరిగాయి. ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవిపై కన్నేసింది ఇండియా కూటమి. మరీ ఎన్డీయే సర్కార్ విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తుందా? లేక పోటీకి సిద్ధమవుతుందా అనేది కొద్దిరోజుల్లో తేలనుంది.
