18వ లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతన లోక్ సభ ప్రొటెం స్పీకర్గా బీజేపీకి చెందిన భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఏడు సార్లు గెలిచిన భర్తృహరిని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనతో ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ హాజరయ్యారు.
ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు మొత్తం 280 మంది ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు. సీనియారిటీ ఆధారంగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రెండు రోజుల పాటు లోక్ సభలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. మొదట ఎంపీగా మోదీ ప్రమాణం చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. ఎంపీలుగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, మనోహర్, నితిన్ గడ్కరీ, చౌహన్, కుమార స్వామి ప్రమాణం చేశారు.
ప్రమాణం చేసిన తెలుగు మంత్రులు
లోక్సభలో తెలుగు రాష్ట్రాల మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. లోక్ సభ సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. తర్వాత కిషన్ రెడ్డి సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీ మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా దేశానికి సేవ చేసే భాగ్యం దక్కిందని మోదీ అన్నారు. ఎంపీలందరికీ స్వాగతం, ఎంపీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని చెప్పారు. ఇవాళ ఎంతో పవిత్రమైన రోజు అన్నారు. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో మొదటిసారి ఎంపికైన ఎంపీలు ముందుకు సాగాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. సభ్యులను కలుపుకొని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.
