తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చివేసిన అధికారులు, జగన్ ఆగ్రహం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్రమ కట్టడాలపై టీడీపీ సర్కార్ దృష్టి సారించింది. ఇందులోభాగంగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలుపెట్టారు. పొక్లెన్లు, బుల్డోజర్స్‌తో భవనాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం ఆ భవనం నిర్మాణం జరుగుతోంది.

 

ముఖ్యంగా నీటిపారుదలశాఖ స్థలంలో అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు శుక్రవారం వైసీపీకి సీఆర్డీయే నోటీసు ఇచ్చింది. సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. ఈ క్రమంలో శనివారం ఉదయం అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు.

 

న్యాయస్థానంలో ఆ పార్టీ తరపున వాదనలు వినిపించారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. అయితే న్యాయస్థానం ఆదేశాలను సీఆర్డీయే కమిషనర్‌కు వైసీపీ తరపు న్యాయవాది తెలిపినట్టు వార్తలు వస్తున్నా యి. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి భవనాన్ని కూల్చివేయడంతో ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు వైసీపీ పెద్దలు.

 

తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చేయడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యగా వర్ణించారు. సీఎం చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. దాదాపు పూర్తి కావొచ్చిన భవనాన్ని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయలేదని, చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా ఈ దుశ్చర్యను ఖండించాలని, ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదంటూ ట్వీట్ చేశారాయన.

Posted Under AP
Editor