దాదాపు 48 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పోలింగ్ శాతంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ నమోదు అయినట్టు వెల్లడించింది.
ఈ విషయాన్ని ఏపీ ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా స్వయంగా వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ 1.07 శాతం. మొత్తం కలిపితే 81.73 శాతం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. గత రెండు ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం పెరిగింది.
పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుని 2014లో 78.90 శాతం కాగా, అదే 2019లో 79.80 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఈసారి ఏకంగా దాదాపు రెండు శాతం మేరా పోలింగ్ శాతం పెరగడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. పది జిల్లాల్లో ఏకంగా 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదు అయినట్టు వార్తలు వస్తున్నాయి.
పోలింగ్ శాతం పెరిగిన ప్రతీసారి ప్రభుత్వాలు మారాయి. ఈసారి వైసీపీ ప్రభుత్వం మారడం ఖాయమన్నది నేతలతోపాటు ప్రజలు బలంగా చెబుతున్నారు. ఇక రాజకీయ పార్టీలు మాత్రం తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నాయి. పోలింగ్ శాతం దాదాపుగా క్లారిటీ రావడంతో నియోజకవర్గాల్లో వారిలో లెక్కలు వేసుకోవడం రాజకీయ పార్టీల వంతైంది. పోలింగ్ ఏజెంట్ల నుంచి డీటేల్స్ తీసుకుని సరిచూసే పనిలో పడ్డాయి ప్రధాన వైసీపీ, టీడీపీలు.
మరో 14 జిల్లాలు 75 శాతానికి పైగానే పోలింగ్ నమోదు కావడం విశేషం. ఈ స్థాయిలో ఎప్పుడు లేదన్నది చెబుతున్నారు ప్రజలు. విశాఖ, అల్లూరు జిల్లాలు కేవలం 65 శాతం కావడం విశేషం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పలుచోట్ల భారీగా వర్షం పడడంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. నాలుగు గంటలలోపు ముగించడంతో పోలింగ్ శాతం తగ్గిందన్నది కొందరి వాదన.
మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో 86 శాతం పైగానే పోలింగ్ నమోదు అయినట్టు సమాచారం. కొన్ని గ్రామాల్లో అయితే 100 శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
