వారణాసిలో బాబు, పవన్, ఎన్డీయే నేతలతో భేటీ..

ఎన్డీయేలోని కూటమి నేతలు వారణాసి బాటపట్టారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సన్నాహాలు చేసింది కమలం పార్టీ. భారీ ర్యాలీతోపాటు ముఖ్యనేతలను అక్కడికి రప్పిస్తోంది. ఈసారి కచ్చితంగా గెలుపు మాదేనన్న సంకేతాలు ఇచ్చేందుకు ఈ ప్లాన్ చేసిందన్నది నేతల మాట.

 

ఈ క్రమంలో ఎన్డీయే నేతలు వారణాసికి పయనమయ్యారు. పవన్ కల్యాణ్ తన ఫ్యామిలీతో కలిసి సోమవారం సాయంత్రం వారణాసికి చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకురాగానే ఆయన్ని మీడియా చుట్టిముట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నారు. ఎన్డీయేకు నాలుగు వందల పైచిలుకు సీట్లు రావడం ఖాయమన్నారు. మరికొందరు నేతలు అక్కడికి తరలిరానున్నారు. ర్యాలీకి ముందుగానీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో కూటమి నేతలు భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.

 

రీసెంట్‌గా తీహార్ జైలు నుంచి ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఆయన ప్రభావం ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌తోపాటు యూపీలోనూ గట్టిగా ఉందని భావించారు కమల నాథులు. ఈ క్రమంలో నార్త్ ఇండియాలో పూర్వవైభవం చాటాలంటే కచ్చితంగా కూటమి నేతలను ఒకేతాటి మీదకు తీసుకొస్తే బాగుంటుందని కమలనాథులు ప్లాన్ వేయడం, అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది ఆ పార్టీ.

 

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్ మొదలు ఒడిషా, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో ఎప్పుడూ లేని విధంగా సుడిగాలి పర్యటన చేశారు. రోజుకు రెండు మూడు సభలకు హాజరయ్యారు. అంతేకాదు వివాదాస్పద అంశాల తేనేతుట్టును కదిపి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే కర్ణాటక‌లో ప్రజ్వల్ వ్యవహారం ఆ పార్టీకి డ్యామేజ్ బాగానే జరుగుతుందని ప్రత్యర్థి పార్టీలు లెక్కలు వేసుకున్నాయి. ప్రజ్వల్ వ్యవహారానికి ముందు రెండురోజుల ముందే కర్ణాటకలో ఎన్నికలు పూర్తికావడంతో దీని ప్రభావం పెద్దగా ఉందని కమలనాధుల మాట.

 

మరోవైపు ఈసారి నార్త్‌లో బలం చాటాలని ఇండియా కూటమి భావిస్తోంది. యూపీతోపాటు ఢిల్లీ, పంజాబ్ తోపాటు ఎన్నికల జరగబోయే ప్రాంతాల్లో మెజార్టీ సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాలను రచించింది. ముఖ్యంగా దక్షిణాది నేతలను నార్త్ వైపు ప్రచారం చేయించాలని భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. రేపోమాపో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక నుంచి సిద్ధరామయ్య, తమిళనాడు నుంచి స్థాలిన్‌లను ప్రచారానికి రప్పించేలా ప్లాన్ చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికి నాలుగు విడతలు లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యాయి. మిగిలింది మూడు దశలు మాత్రమే. ఈసారి మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్‌తోపాటు ఇండియా కూటమి లెక్కలు వేసుకుంటోంది. మొత్తానికి ఎప్పుడు లేని విధంగా ఈసారి దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయనే చెప్పవచ్చు.

Posted Under AP
Editor