కుప్పంలో దాడులు, పోలీసుల మొహరింపు..

ఆంధ్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ క్లైమాక్స్‌కు చేరడంతో దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ-విపక్ష టీడీపీ కేడర్ మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. సాయంత్రం పడగానే ఎవరి వ్యూహాల్లో వాళ్లు నిమగ్నమవుతున్నారు. ఎప్పుడు, ఏ రూపంలో దాడులకు దిగుతున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

 

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం గురించి అందరికీ తెల్సిందే. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాక ఆ పార్టీ కేడర్ ఫుల్‌జోష్‌లో ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కచ్చితంగా ఓడించాలని ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను రచించింది. వైసీపీ ప్లాన్‌ను ముందే పసిగట్టిన తెలుగుదేశం క్యాడర్, నిత్యం అలర్ట్‌గా ఉంది.

 

కుప్పం మున్సిపాలిటీ పరిధి లక్ష్మిపురంలో టీడీపీ- వైసీపీ కార్యకర్తలు రాత్రి బాహాబాహికి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పలువురికి గాయపడగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన 25వార్డు కౌన్సిలర్ మణి‌తోపాటు, పలువురిని ఈఎస్ మెడికల్ కాలేజీ‌కు తరలించారు.

 

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి భరత్, బాధితులను పరామర్శించారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కుప్పంలో గెలవలేక పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. లక్ష్మిపురంలో భారీగా పోలీసులు మోహరించారు. అత్యంత సమస్యాత్మక, సున్నితమైన నియోజకవర్గాల్లో కుప్పం ఒకటి.

 

పరిస్థితి జఠిలంగా మారితే 144 సెక్షన్ అమలు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు పోలీసులు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, కౌన్సిలర్ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు వైసీపీ నాయకులు. వీటిని కంట్రోల్ చేయలేక పోలీసులు నానాఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఫోర్స్‌ను అక్కడ రంగంలోకి దించారు.

Posted Under AP
Editor