ఏపీలో పథకాలకు బ్రేక్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!

ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధుల్నివారి ఖాతాల్లో జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ విచారణ జరిగింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈసీ అభిప్రాయం కోరింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయం ఈసీకి చెప్పాలని కూడా సూచించింది.

 

ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ పేరుతో నిలిపేయడం సరికాదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. మే నెలలో విడుదల చేయాల్సిన నిధుల్ని నిలిపేయడం వల్ల అవి మురిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడే నిధుల విడుదల ఎందుకన్న ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని హైకోర్టుకు తెలిపింది.

 

దీనిపై స్పందించిన హైకోర్టు.. మే చివరకు అంటే చాలా రోజుల సమయం మిగిలి ఉంది కదా అని అడిగింది. అలాగే ఈసీ కూడా తాము పథకాల విడుదలను నిలిపేయాలని చెప్పలేదని, కేవలం ఎన్నికల పోలింగ్ ముగిసేవరకూ వాయిదా వేయమని మాత్రమే చెప్పినట్లు హైకోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలో ఈసీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత వెలువడే నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ఈ పిటిషన్ పై విచారణను ఎల్లుండి వరకూ అంటే గురువారం వరకూ వాయిదా వేసింది.

Posted Under AP
Editor