ఆంధ్రప్రదేశ్లో మరో వారంలో రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. పవన్కల్యాణ్ కూటమి తరపున పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయన తరపున కుటుంబ సభ్యులు అంతా ప్రచారానికి వచ్చారు.
నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్ రోడ్ షోలు నిర్వహించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి బయటకు రాలేదు. దీనిపై రకరకాలుగా ప్రత్యర్థి పార్టీల నేతలు చర్చించుకోవడం మొదలుపట్టారు. అంతేకాదు కూటమి అభ్యర్థులు వెళ్లి చిరంజీవిని కలిశారు. మీ గెలుపు కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు.
తాజాగా తమ్ముడు పవన్కల్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మంగళవారం మెగాస్టార్ చిరంజీవి స్పెషల్గా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. తమ ఇంట్లో ఆఖరివాడైనా ప్రజలకు మంచి చేయడంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ ముందు ఉంటారన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాడన్నారు. తన తమ్ముడు పడుతున్న అవస్థలు చూస్తుంటే బాధేస్తుందన్నారు.
ఒకరకంగా చెప్పాలంటే అతడు సినిమాల్లోకి బలవంతంగా వచ్చినా, రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చారన్నారు మెగాస్టార్. జనమే జయమని నమ్మి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ను అక్కడి ప్రజలు గెలిపించాలని కోరారు.
ముఖ్యంగా పవన్ తన సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చుపెట్టడం, ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో అందించడం, మత్య్సకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కావాలని జనం కోరుకుంటారని అందులో పేర్కొన్నారు.
తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని గుర్తు చేశారు చిరంజీవి. చట్టసభల్లో అతడి గొంతును మనం వినాలని చెప్పుకొచ్చారు. పిఠాపురం ప్రజలకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా నిలబడతాడని మనసులోని మాటను బయటపెట్టారు మెగాస్టార్.
