తెలంగాణ ఖనిజాభివృద్ధి మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ దళిత నేత, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తుండగా గతరాత్రి ఆయనను పంతంగి చెక్ పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అనంతరం వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి నేరుగా న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. క్రిశాంక్ను విచారించేందుకు రేపోమాపో పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ వేయనున్నారు. రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్ల మూసివేతకు సంబంధించి ఫేక్ లేఖలో సంతకాలు ఫోర్జరీ చేసి సోషల్మీడియాలో పోస్టు చేశారన్న వ్యవహారంపై అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసుస్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది.
ఉస్మానియా హాస్టల్ మూసివేతకు సంబంధించి కేసీఆర్ పలుమార్లు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. మరోవైపు క్రిశాంక్ అరెస్ట్పై కారు పార్టీ రియాక్ట్ అయ్యింది. క్రిశాంక్ ఉద్యమ గొంతుకని, అన్యాయంగా అరెస్ట్ చేశారని సోషల్మీడియా వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలు, ఢిల్లీలో బీజేపీ అరాచకాలపై గళమెత్తినందుకే అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్-బీజేపీలు కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
