అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు…

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోను కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ – డ్రోన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు భద్రతాధికారి ఎస్పీ గౌరవ్ బంస్ వాల్ తెలిపారు.

 

ప్రపంచంలో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలను పోలీసులకు అందుబాటులో ఉంచుతున్నట్లు శాంతిభద్రతల డీజీ ప్రశాంత్‌ కుమార్‌ ప్రకటించారు. అయోధ్యకు వచ్చే మార్గాల్లో చాలా ప్రదేశాలు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. వాటిని తొలగించి శుభ్రం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ సూచనలు ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. రైల్వేస్టేషను, బస్‌ స్టేషన్లలో అదనపు బలగాల పహారా ఉంటుందని డీజీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు.

Editor