బకాయిలు చెల్లిస్తేనే.. 200 యూనిట్స్‌ విద్యుత్‌ ఫ్రీ..!

మధ్యతరగతిలో ‘గృహజ్యోతి’ ఆశలు

కాంగ్రెస్‌ హామీల్లో గృహజ్యోతి పథకం కీలకమైంది. అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో ఈ హామీ కూడా ఓటర్లను బాగా ఆకర్షించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. మేనిఫెస్టోలో చేర్చింది. ఇది అమలైతే మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది లబ్ధి పొందుతారు. ఎప్పటి నుంచి గృహజ్యోతి ప్రారంభిస్తారు అని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో ఈనెలలోనే అమలు చేస్తారా లేక వచ్చే నెలలో ప్రారంభిస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

డిసెంబర్‌ నుంచే మాఫీ అని..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కరెంటు బిల్లులపై పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు. అధికారంలోకి వస్తే డిసెంబర్‌ నుంచే విదాఉ్యత్‌ బిల్లులు మాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ అమలు కాలేదు. జనవరిలో కూడా అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. పథకం ప్రారంభానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

బకాయిలు చెల్లిస్తేనే..

ఇదిలా ఉండగా పాత విద్యుత్‌ బకాయిలు చెల్లించిన వారికే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇటీవల ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు సబ్సిడీ విద్యుత్‌ కోసం వచ్చాయి. దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు క్లియర్‌ చేపించాలని చూస్తోంది. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే రూ.6 కోట్ల విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత బకాయిలు చెల్లించిన వారికే ఉచితం విద్యుత్‌ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. బకాయి లేనివారినే గృహజ్యోతి పథకానికి ఎంపిక చేస్తారని సమాచారం.

Editor