చెన్నై: దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
ఈ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరతగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.
ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.
తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ వందే భారత్ స్లీపర్ కోచ్లు ఎలా ఉంటాయనేది రివీల్ చేసింది. వీటికి సంబంధించిన డిజైన్లను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్లీపర్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా ఇందులో 857 బెర్తులు ఉండబోతోన్నాయి. ఇందులో 823 బెర్తుల్లో మాత్రమే ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
మిగిలిన బెర్తులను రైలులో విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు, సిబ్బంది కోసం కేటాయిస్తారు. ఒక్కో కోచ్లో నాలుగుకు బదులుగా మూడు టాయ్లెట్లు ఉంటాయి. ఓ మినీ ప్యాంట్రీ ఉంటుంది. దివ్యాంగుల కోసం అనువుగా ఉండేలా ర్యాంప్ను సైతం అందుబాటులోకి తీసుకుని వచ్చేలా డిజైన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.
