ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో కనీసం 52 మంది మరణించినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
మరో వందమందికిపైగా గాయపడినట్లు తెలిపింది. మృతుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు.
మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ముస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. అదే సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 52 మంది మరణించగా.. మరో 100 వరకు గాయపడినట్లు పాకిస్థాన్ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. క్షతగాత్రులు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా, ఈ ర్యాలీ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి కూడా ఈ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ కారు వద్దే పేలుడు సంభవించినట్లు చెప్పారు. ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధరించిటన్లు వెల్లడించారు.
ఓ సూసైడ్ బాంబర్ డీఎస్పీ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ఘటన చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
