నోయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుకుంటున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు అతను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనట్టు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
సంబంధిత బాధితురాలు తన కుటుంబంతో కలిసి నోయిడాలో నివాసముంటోంది. ఆమె వయస్సు 17ఏళ్లు. మరోవైపు 20ఏళ్ల నిందితుడు.. సమీపంలోని హార్పూర్ జిల్లాలో జీవిస్తున్నాడు. కాగా.. వీరిద్దరు ఇన్స్టాగ్రామ్లో కలుసుకున్నారు. కొంతకాలం ఛాటింగ్ చేసుకున్నారు.
తనతో బయటకు రావాలని నిందితుడు.. అనేకమార్లు బాలికను కోరాడు. అందుకు ఒప్పుకున్న బాలిక.. ఈ నెల 6న అతనితో బయటకు వెళ్లింది. ఆ రోజు రాత్రి ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు!
కూతురు ఇంటికి రాకపోవడంతో భయపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక రోజు వ్యవధిలో బాలికను రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు అసలేం జరిగిందని బాలికను విచారించారు. ఈ క్రమంలోనే బాలిక అసలు విషయం చెప్పింది.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి తనని పిలిచినట్టు, అతనితో వెళ్లినట్టు ఆమె పేర్కొంది. అప్పుడే తనపై ఆ వ్యక్తి అత్యాచారం చేసినట్టు వివరించింది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని.. పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని బాధితురాలి కుటుంబానికి హామీనిచ్చారు.
